JEE ADVANCED RESULTS OUT : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల విడుదల ! సత్తాచాటిన తెలుగు విద్యార్థులు !

0

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. తెలుగు విద్యార్థి వావిలాల చిద్విలాస్‌ రెడ్డి (నాగర్‌కర్నూల్‌) టాపర్‌గా నిలవడం విశేషం. అమ్మాయిల కేటగిరీలో నాయకంటి నాగ భవ్యశ్రీ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 43,773 మంది అర్హత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.ఈ నెల 4న రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. దాదాపు 1.80 లక్షల మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది రాశారు. తాజాగా ఫలితాలతో పాటు తుది ‘ఆన్సర్‌ కీ’ని కూడా ఐఐటీ గువాహటి విడుదల చేసింది. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఇక జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ ప్రక్రియ (%జీశీూAA% 2023) ప్రారంభమవుతుంది. పరీక్షలో కటాఫ్‌ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని ‘జోసా’ కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. పాసైన వారు ఈ నెల 19 నుంచి మొదలయ్యే కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది.

సోమవారం నుంచి జోసా కౌన్సెలింగ్‌

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్‌ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. బీటెక్‌, బీఎస్సీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) షెడ్యూల్‌ ఇటీవలే విడుదలైంది. తొలుత జోసా కౌన్సెలింగ్‌ తర్వాత ఐఐటీలు మినహా మిగిలిన విద్యాసంస్థల్లోని సీట్లను సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌బోర్డు (సీశాబ్‌) చేపడుతుంది. ఆదివారం ఫలితాలు విడుదలైన మరుసటి రోజైన సోమవారం నుంచే కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. జాతీయంగా 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్‌ ఐటీలు, మరో 38 కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో సీట్లను జోసా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీచేస్తారు. సోమవారం నుంచి జూలై 26 వరకు 38 రోజులపాటు కౌన్సెలింగ్‌ కొనసాగనున్నది.

ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో 40 వేలకు పైగా సీట్ల భర్తీకి నిర్వహించే సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ బోర్డు (సీసాబ్‌) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) రూర్కీకి సీ-సాబ్‌ బాధ్యతలు అప్పగించింది. 3 లక్షలకు పైగా జేఈఈ మెయిన్‌ అభ్యర్థులు సీసాబ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాలున్నాయి. ఇక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందేవారు ప్లస్‌ టు లెవల్లో (12వ తరగతి లేదా ఇంటర్‌లో) 75% మార్కులు, లేదా టాప్‌-20 పర్సంటైల్‌ పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు 65% మార్కులు పొందితే సరిపోతుంది. గతంలో ఈ నిబంధన అమల్లో ఉండగా, కరోనా కారణంగా మినహాయింపునిచ్చి, తాజాగా పునరుద్ధరించారు.

టాపర్లు వీళ్లే..

1. వావిలాల చిద్విలాస్‌ రెడ్డి

2. రమేశ్‌ సూర్య తేజ

3. రిషి కర్లా

4. రాఘవ్‌ గోయల్‌

5. అడ్డగడ వెంకట శివరామ్‌

6. ప్రభవ్‌ ఖండేల్వాల్‌

7. బిక్కిన అభినవ్‌ చౌదరి

8. మలయ్‌ కేడియా

9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి

10. యక్కంటి ఫణి వెంకట మనీంధర్‌ రెడ్డి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !