Srichaitanya Score : శ్రీచైతన్య రూ.1000 కోట్లు మాయాజాలం !

0
  • స్కోర్‌ స్కాలర్‌షిప్‌ ఫలితాలు కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం.
  • బహిరంగ పరిచేందుకు విముఖం.
  • రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల జాబితా ఎక్కడ ? 
  • ఒక్కో విద్యార్థి నుండి 150/` ఎగ్జామ్‌ ఫీజు
  • నగదు బహుమతులు, మెమెంటోలతోనే మమ.
  • ఇతర స్కూల్స్‌/కాలేజీల్లో టాపర్స్‌ను లాగేసుకోవటమే టార్గెట్‌.

మేడిపండు చూడ...అన్న చందంగా మారింది శ్రీచైతన్య స్కోర్‌ స్కాలర్‌షిప్‌ తీరు. శ్రీచైతన్య స్కోర్‌ రూ. 1000 కోట్లు స్కాలర్‌షిప్‌ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడ్డారు.  శ్రీచైతన్య విద్యార్థులను మినహాయించి, దేశంలోని వేరే ఇతర స్కూల్స్‌లో చదివే విద్యార్థులే లక్ష్యంగా ఈ పరీక్ష నిర్వహించింది శ్రీచైతన్య. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పరీక్ష వ్రాసిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఏ చిన్న ఒలింపియాడ్‌లో సెలక్షన్‌ సాధించిన పత్రికలతో పాటు మీడియా ప్రకటనలతో నానా హంగామా చేసే శ్రీచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ. 1000 కోట్లతో స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ ఫలితాలను మాత్రం బహిరంగంగా ప్రకటించలేదు. కేవలం ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం చేసింది. రూ. 1000 కోట్లు విలువైన స్కాలర్‌షిప్‌ సాధించిన వారి వివరాలను ప్రకటించింకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.  ప్రతి తరగతిలో కేవలం 50 లోపు ర్యాంకులు సాధించిన వారికి వివిధ స్థాయిల్లో నగదు బహుమతులు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది శ్రీచైతన్య. ఈ నగదు బహుమతుల విలువ 25 లక్షలు లోపే ఉండటం గమనార్హం.  సమాజ్‌టుడే ఇన్ఫినిటీ లెర్న్‌ ప్రతినిధులను సంప్రదించగా, ఫలితాలు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటు ఉంటాయి, ఆప్‌లైన్‌లో వ్రాసిన వారి వివరాలు ఆయా బ్రాంచీలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. మొత్తం ఫలితాలకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదు అని తెలిపారు.

సోషల్‌ మీడియాలో భారీ ప్రచారం   

పరీక్షకు రెండు నెలలు ముందు నుండే సోషల్‌ మీడియా వేదికగా భారీ ప్రచారానికి తెరలేపింది ఇన్ఫినిటి లెర్న్‌. పైకి స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ మాత్రమే, కానీ దీని వెనుక పెద్ద తతంగమే నడిచింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులను వెతికి వెతికి పట్టుకోవటమే ఈ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. శ్రీచైతన్య విద్యాసంస్థల్లోని విద్యార్థులు కాకుండా ఇతర విద్యాసంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు సేకరించటమే శ్రీచైతన్య స్కోర్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ టార్గెట్‌.  ఆ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేసింది శ్రీచైతన్య. ఇప్పటికే ఈ స్కోర్‌ ఎగ్జామ్‌లో పాల్గొన్న విద్యార్థుల వివరాలను సేకరించిన శ్రీచైతన్య వచ్చే విద్యాసంవత్సరానికి కల్లా వారందరిలో శ్రీచైతన్య విద్యాసంస్థల్లోలోకి రప్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి ఉచిత విద్యను ఆఫర్‌ చేయటం దగ్గర నుండి భారీ నగదు ఆశచూపటం, ఇతర ప్రయోజనాలు కలిగించేలా ప్రలోభాలకు గురిచేయటం వంటి కార్యక్రమాలతో విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చేరేలా మభ్యపెట్టటమే ఈ స్కాలర్‌షిప్‌ వెనుక ఉన్న అసలు సిసలు ఉద్ధేశ్యం. ఎందుకంటే బాగా టాలెంటెడ్‌ విద్యార్థులు రాబోయే రోజల్లో నీట్‌, జెఈఈ అడ్వాన్స్‌డ్‌ లాంటి ఎగ్జామ్స్‌లో 10 లోపు ర్యాంకు సాధిస్తే సంస్థ తలరాతే మారిపోతుంది. ఒక్క ర్యాంకు సాధిస్తే చాలు వేలాది అడ్మిషన్లు వచ్చేస్తాయి. గత సంవత్సరం శ్రీచైతన్య ఫలితాలను తీసుకుంటే జెఇఇ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి ఎగ్జామ్స్‌లో ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 1 వ ర్యాంకు సాధించింది. ఆ ర్యాంకులతోనే మార్కెటింగ్‌ చేసుకుంటోంది. శ్రీచైతన్యలో చదివితే ఫస్ట్‌ ర్యాంకు వస్తుంది అని నమ్మిస్తోంది. గత సంవత్సరం వచ్చిన ఫలితాల్లో కేవలం 3 అంటే 3 ర్యాంకులు చూపించి లక్షలాది అడ్మిషన్లు జరిగాయి అంటే నమ్ముతారా ? మరి ఈ లక్షలాది మందికి ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు వస్తుందా ? పేరెంట్స్‌ ఎందుకు ఆలోచించటం లేదో వారికే తెలియాలి. ఎందుకంటే తమ పిల్లాడికి మంచి ర్యాంకు వస్తుందేమోనని ఆశ. అదే ఆశే ప్రైవేటు విద్యాసంస్థలకు వరంగా మారింది. కాసుల వర్షం కురిపిస్తోంది. 

రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ ఉత్త బూటకమేనా ? 

అసలు శ్రీచైతన్య  నిజంగా రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ ఇస్తుందా ? ప్రచారం కోసమే రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ను వాడుకుంటుందా ? స్కాలర్‌షిప్‌  పొందిన విద్యార్థుల జాబితా శ్రీచైతన్య ఎందుకు ప్రకటించటం లేదు ?  ఇలాంటి ప్రశ్నలు తల్లిదండ్రుల మనసుల్లో తలెత్తుతున్నాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే రూ.1000 కోట్ల స్కాలర్‌షిప్‌ ఇవ్వటం అనేది ఉత్తమాట. ఒకవేళ వేరే సంస్థలో చదువుతూ శ్రీచైతన్య స్కోర్‌ ఎగ్జామ్‌లో మంచి ఫలితం వచ్చినా ప్రయోజనం దక్కదు. ఎందుకంటే శ్రీచైతన్య సంస్థలో అడ్మిషన్‌ తీసుకున్న వారికే మాత్రమే ఆ ప్రయోజనం వర్తిస్తుంది. కావలంటే నిశితంగా గమనించండి రూ. 1000 కోట్ల వద్ద స్టార్‌ మార్క్‌తో షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది. ఆ షరతులు అన్నీ శ్రీచైతన్య సంస్థకు అనుకూలంగా ఉంటాయి. చివరికి మోసపోతున్నది విద్యార్థులే. ప్రతిభావంతులని గుర్తించటం, వారిని తమ సంస్థల్లో చేర్చుకోవటం. ఎగ్జామ్‌ రాసే ప్రతి స్టూడెంట్‌ దగ్గర నుండి సరాసరిన 150/- వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం 5 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్‌ వ్రాయగా, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష వ్రాసిరాని ఓ అంచనా. ఈ లెక్కన సుమారు 10 కోట్ల రూపాయలు ఎగ్జామ్‌ ఫీజుల నుండి శ్రీచైతన్యకు లభిస్తోంది. ఎగ్జామ్‌ వ్రాసే వరకే శ్రీచైతన్య హడావిడి, ఆ తర్వాత 50 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించి చేతులు దులుపుకుంటుంది. నగదు బహుమతులు అంటే ఓకే మరి స్కాలర్‌షిప్‌ పొందిన విద్యార్థుల వివరాలు మాత్రం అంతా గోప్యం. ఇన్ఫినిటీ లెర్న్‌ వెబ్‌సైట్‌ వెతికినా ఎక్కడ సమాచారం లభించదు. ఒలింపియాడ్స్‌లో, ఇతర పోటీపరీక్షల్లో ఒకటి లేదా రెండు సెలక్షన్స్‌కి, ర్యాంకులను ఆర్భాటంగా ప్రకటించే శ్రీచైతన్య...రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అందిస్తున్నప్పుడు స్కాలర్‌షిప్‌ గెలుచుకున్న విద్యార్థుల వివరాలు ఎందుకు ప్రకటించటం లేదు. ఎందుకు గోప్యత పాటిస్తోంది. రూ. 1000 కోట్ల స్కాలర్‌షిప్‌ అనేది బోగస్‌యేనా ? కనీసం రూ. 50 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌ పొందిన వారు ఉన్నారా ? అసలు శ్రీచైతన్య స్కాలర్‌షిప్‌ ఇస్తుందా ? అనే అనుమానాలు కలగక మానదు.  గత 3 సంవత్సరాలుగా శ్రీచైతన్య నిర్వహించిన స్కోర్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్స్‌లో 1000 కోట్లు ఎంత మంది విద్యార్థులకు అందించిందో పూర్తి వివరాలతో కూడిన సమాచారం ప్రజలకు అందించే సాహసం శ్రీచైతన్య చేయగలదా ?

మరో కోణం ?

స్కోర్‌ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ నిర్వహించేంది శ్రీచైతన్య విద్యాసంస్థలు అయినా దాని నిర్వహణా బాధ్యతలు మాత్రం ఇన్ఫినిటీ లెర్న్‌ (ర్యాంకుగురు టెక్నాలజీస్‌ ప్రై.లి. కంపెనీ) కి అప్పగించింది శ్రీచైతన్య. ఇది కూడా శ్రీచైతన్య డైరెక్టర్స్‌ ఆధ్వర్యంలో నడిచే ఓ షెల్‌ కంపెనీనే. పైకి ఇది శ్రీచైతన్య నిర్వహించే ఎగ్జామ్‌లాగా ప్రకటనలు గుప్పించటం, ఈ ఎగ్జామ్స్‌ నిర్వహణ ద్వారా తనకు చెందిన ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలకు డబ్బుని మళ్ళించటం కోసం శ్రీచైతన్య విద్యాసంస్థ నిర్వాహకుల ఎత్తుగడ. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీలు, అకాడమీలలోని  వివిధ రాష్ట్రాల్లోని వివిధ సొసైటీల ద్వారా సొమ్మును  ర్యాంక్‌గురు టెక్నాలజీస్‌ ప్రై.లి. కంపెనీలోకి మళ్ళీంచటం కోసమే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత 4 లేదా 5 సంవత్సరాల నుండి ఇలాంటి ఎగ్జామ్‌ నిర్వహించటం ద్వారా సరీక్షల నిర్వహణ, సాంకేతిక సాయం పేరుతో ర్యాంకుగురు టెక్నాలజీస్‌ కంపెనీలోకి పెద్ద ఎత్తున నిధుల మళ్ళింపు జరుగుతోంది. ఇప్పటికే  ర్యాంక్‌గురు టెక్నాలజీస్‌ ప్రై.లి. రూ. 100 కోట్ల కంపెనీగా మలిచింది శ్రీచైతన్య యాజమాన్యం.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !