Supermme Court : ఆర్టికల్‌ 370 రద్దు సరైనదే...సుప్రీం సంచలన తీర్పు !

0

కశ్మీర్‌​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌370 రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 370 తాత్కాలిక అధికరణం మాత్రమేనని స్పష్టం చేసింది. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి అంతర్గత సార్వభౌమాధికారం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌​తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.జమ్ము కశ్మీర్‌​కు రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబర్‌ 30 లోగా జమ్ము కశ్మీర్‌​కు ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేసింది. మరోవైపు, జమ్ము కశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌​ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న నిర్ణయాన్ని సైతం సమర్థిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

జస్టిస్‌ కౌల్‌ ఏమన్నారంటే?

న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా రద్దును సమర్థించినప్పటికీ మూడు వేర్వేరు తీర్పులు వెలువరించారు. సీజేఐ వివరణతో ఏకీభవిస్తూనే భిన్నమైన కారణాల పేర్కొంటూ తీర్పు రాశారు మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌​కే కౌల్‌. ఆర్టికల్‌ 370 ఉద్దేశం జమ్ము కశ్మీర్‌​ను క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల స్థాయికి తీసుకురావడమేనని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు జమ్ము కశ్మీర్‌ రాజ్యాంగ సభ అనుమతి అవసరమన్న విషయాన్ని విస్తృత కోణంలో చూడలేమని అన్నారు. మరోవైపు, జమ్ము కశ్మీర్‌​లో మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలపై దర్యాప్తు కోసం కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కేంద్రం వాదనలివే!

ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 16 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 5న తీర్పును రిజర్వ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌-370 రద్దును సమర్థిస్తూ వాదనలు వినిపించింది. ప్రత్యేక హోదా రద్దు విషయంలో ఎలాంటి రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంది. విలీన ఒప్పందం ద్వారా భారత్‌​లో జమ్ము కశ్మీర్‌ అంతర్భాగమైందని, స్వాతంత్య్రం తర్వాత అనేక చిన్న రాజ్యాలు దేశంలో ఇలాగే కలిశాయని కోర్టుకు విన్నవించింది. అయితే, విలీనం తర్వాత వాటి సార్వభౌమాధికారం పూర్తిగా భారత్‌​లో అంతర్భాగమైనట్లు వివరించింది. జమ్ము కశ్మీర్‌​కు ప్రస్తుతం కల్పించిన కేంద్రపాలిత ప్రాంత హోదా తాత్కాలికమని, భవిష్యత్‌​లో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. లద్దాఖ్‌ మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుందని పేర్కొంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

పిటిషనర్లు ఏమన్నారంటే?

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, గోపాల్‌ సుబ్రమణ్యం, రాజీవ్‌ ధావన్‌, జఫర్‌ షా, దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఆర్టికల్‌ 370 తాత్కాలికం కాదని, జమ్ము కశ్మీర్‌ రాజ్యాంగ సభ రద్దు తర్వాత అది శాశ్వతత్వం పొందిందని సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ వాదించారు. ఆర్టికల్‌ 370 రద్దును పార్లమెంట్‌ చేపట్టలేదని అన్నారు. జమ్ము కశ్మీర్‌ రాజ్యాంగ సభ ప్రతిపాదించకుండా ఈ ఆర్టికల్‌​ను రద్దు చేయలేరని అన్నారు. విలీనం సందర్భంగా జమ్ము కశ్మీర్‌ విదేశాంగ, రక్షణ, సమాచారానికి సంబంధించిన అధికారాలను మాత్రమే అప్పటి మహరాజు భారత్‌​కు అప్పగించారని జమ్ము కశ్మీర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ వాదించింది. పరిపాలన, చట్టాల రూపకల్పన వంటి అధికారాలను రాష్ట్రానికే అప్పగించినట్లు తెలిపింది. జమ్ము కశ్మీర్‌​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్ము కశ్మీర్‌​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.

కశ్మీర్‌​లో భద్రత కట్టుదిట్టం

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. లోయలో అదనపు బలగాలను మోహరించారు. శ్రీనగర్‌​ సహా అనేక ప్రాంతాల్లో చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే, ప్రజల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని అధికారులు తెలిపారు. సోషల్‌ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని యూజర్లకు సూచించారు కశ్మీర్‌ సైబర్‌ పోలీసులు. దుష్ప్రచారాలు, విద్వేష ప్రసంగాలను షేర్‌ చేయవద్దని కోరారు. హింసను ప్రేరేపించే విధంగా ఉన్న కంటెంట్‌​ను పోస్ట్‌ చేయవద్దని స్పష్టం చేశారు.

ముఫ్తీ గృహనిర్బంధం?

మరోవైపు, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఫ్తీ ఇంటి తలుపులకు తాళం వేశారని, అక్రమంగా గృహనిర్బంధం చేశారని పీడీపీ ఎక్స్‌​లో వెల్లడిరచింది. అయితే, ఈ వార్తలన్నీ అవాస్తవమని, రాజకీయ కారణాలతో ఎవరినీ గృహనిర్బంధం చేయలేదని జమ్ము కశ్మీర్‌ ఎల్‌​జీ మనోజ్‌ సిన్హా స్పష్టం చేశారు. మరోవైపు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, వైస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా నివాసాల వద్దకు వెళ్లేందుకు జర్నలిస్టులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !