T Congress : కర్ణాటకకు తెలంగాణ కాంగ్రెస్‌ క్యాంప్‌ రాజకీయాలు ?

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనంగా మారాయి. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా ఫలితాన్ని అంచనా వేసింది. కొన్ని సంస్థలు మరోసారి బీఆర్‌ఎస్‌దే గెలుపు, హ్యాట్రిక్‌ విజయం ఖాయం అని అంచనా వేయగా.. చాలా వరకు సంస్థలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అంచనా కట్టాయి. దీంతో కాంగ్రెస్‌ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో బిజీ బిజీగా ఉంది. ఓ పక్క గెలుస్తామనే ధీమాగా ఉన్నా..మరోపక్క కర్ణాటక రాజకీయ క్యాంపు రాజకీయాల ప్లాన్‌లను షురూ చేస్తోంది. దీంట్లో భాగంగానే ఫలితాలు వెలువడిన తరువాత గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం వరకు ఓ చోట రహస్యంగా దాచిపెట్టేందుకు యత్నాలు చేస్తోంది. కర్ణాటకలోని చిక్బల్లాపూర్‌ లేదా మరోచోట క్యాంపు ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించే ఏర్పాట్లలో నిమగ్నమైంది. 

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని

బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని మొదటినుంచి చెబుతున్న టీ కాంగ్రెస్‌ దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవటంలో దాదాపు సక్సెస్‌ అయ్యిందనే ధీమాతో ఉంది. దీంతో తమకు 70కు పైగా సీట్లలో విజయం సాధిస్తామని చెబుతు వచ్చింది. ఈక్రమంలో పోలింగ్‌ పూర్తి అయ్యింది. ఎగ్జిట్‌ పోల్స్‌ లో కూడా కాంగ్రెస్‌ దే హవా అనే విషయం వెల్లడైంది. 2014 ఎన్నికల తర్వాత టీడీఎల్పీని, కాంగ్రెస్‌, సీపీఐల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్న కేసీఆర్‌.. 2019లో కాంగ్రెస్‌ నుంచి 12 మందిని, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎసలో విలీనం చేసుకున్నారు. హంగ్‌ వస్తే కేసీఆర్‌ తన మార్కు రాజకీయాన్ని తెరపైకి తెచ్చే చాన్స్‌ ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓ పక్క తమదే అధికారం అనే ధీమా ఉన్నా..గెలిచినవారిని కాపాడుకుకోవాలనే ముందు చూపుతో వారిని వేరే ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.

క్యాంప్‌కి తరలించే యోచన 

ఒక వేళ హంగ్‌ వస్తే పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనా దృష్టి పెట్టింది. గెలిచేందుకు ఆస్కారం ఉన్న అభ్యర్థులను ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించే ప్లాన్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఏ క్షణంలోనైనా బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను పార్టీ నాయకత్వం అప్రమత్తం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది కాబట్టి అక్కడైతేనే తమ అభ్యర్ధులు సేఫ్‌గా ఉంటారని భావిస్తోంది. ఇక అక్కడ కర్ణాటక కాంగ్రెస్‌ గెలుపులో కీలక పాత్ర వహించిన డీకే శివకుమార్‌ ఉండనే ఉన్నారు. దీంతో ఈ క్యాంపు ఆపరేషన్‌ శివకుమార్‌ నేతృత్వంలో నడుస్తున్నట్లు సమాచారం. మరీ ముందు చూపుతో ఫలితాలు వెలువడకుండానే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు పార్టీ నుంచి బాధ్యులను నియమించి.. సదరు అభ్యర్థులు గెలిచినట్లుగా క్లారిటీ తీసుకున్న వెంటనే కర్ణాటక తరలించే చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !