Dawood Ibrahim: దావూద్‌పై విషప్రయోగం ? పరిస్థితి విషమం ?

0


పరారీలో ఉన్న 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, అండర్‌వరల్డ్‌ డాన్‌, దావూద్‌ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో పాకిస్థాన్‌​లోని కరాచీలో ఉన్న ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. దావూద్‌పై విష ప్రయోగం జరగడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వెంటనే దావూద్‌ను తన అనుచరులు ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దావూద్‌పై విష ప్రయోగం జరిగిందనే వార్త ఏ రిపోర్టులోనూ ధృవీకరించలేదు. మరోవైపు.. దావూద్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దావూద్‌​కు భారీ భద్రత మధ్య ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దావూద్‌ రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆ ఆస్పత్రి ఫ్లోర్‌​లో అతడొక్కడే ఉన్నట్లు, వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతిస్తున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ముంబయి పోలీసులు దావూద్‌ బంధువుల దగ్గరి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాపై అనధికార నిషేధం !

మరోవైపు.. పాకిస్థాన్‌లో దావూద్‌ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనతో పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. లాహోర్‌, కరాచీ, ఇస్లామాబాద్‌ వంటి ప్రముఖ నగరాల్లో కూడా సర్వర్లు పనిచేయలేదని తెలుస్తోంది. ఇది కాకుండా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా పనిచేయలేదని సమాచారం. ఇక రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్‌ స్పీడ్‌ మొత్తం తగ్గిపోయిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్‌బ్లాక్‌ అనే సంస్థ పాకిస్థాన్‌లో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం ఉన్న విషయాన్ని ధృవీకరించింది. మరోవైపు.. దావూద్‌ ఇబ్రహీంకు ఎవరో విషం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయని పాక్‌కు చెందిన జర్నలిస్ట్‌ అర్జూ కజ్మీ పేర్కొన్నారు. ఈ ఘటనతో దావూద్‌ ఆరోగ్యం దారుణంగా క్షీణించిందని.. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం కరాచీలోని ఓ ఆస్పత్రిలో దావూద్‌ చికిత్స పొందుతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయని.. అయితే ఇది ఎంత వరకు నిజమో తనకు తెలియదని పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో ఏదో చీకటి కోణం ఉందని తెలుస్తోందని.. పాకిస్థాన్‌లోని సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ సర్వర్‌లను డౌన్‌ చేశారని తెలిపారు.

ముంబై పేలుళ్ల సూత్రధారి

1993లో జరిగిన ముంబయి దాడులకు దావూద్‌​ ఇబ్రహీం సూత్రధారి. ఈ దాడుల్లో 250 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. దీంతో దావూద్‌​ భారత్‌​ మోస్ట్‌​ వాంటెడ్‌​ క్రిమినల్‌ లిస్ట్‌​లో చేరాడు. అతడి గురించి ఎన్‌​ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌​లోని కరాచీలో ఉంటున్నాడని భారత్‌​ పలుమార్లు చెప్పినా వాటిని పాక్‌​ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే దావుద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల జాబితాలో దావూద్‌ పేరు కరాచీ అడ్రస్‌​తో ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !