Kodandaram : ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రొ.కోదండరామ్‌ ?

0


టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కోదండరామ్‌ ప్రకటించడంతో టీజేఎసకు సీట్లు కేటాయించలేదు. కానీ.. ఇరు పార్టీల మధ్య మైత్రీ బంధం కొనసాగింది. కోదండరామ్‌ కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆ పార్టీ పెట్టిన అనేక రకాల నిర్బంధాలను ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం నుంచి దూరం కావాలని ఆకాంక్షించారు. బుధవారం సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబురాల్లో పాల్గొని, బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని ఆరోపించారు. అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆయనకు టీఎస్పీఎస్సీ ఛైర్మెన్‌ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

కీలక పదవులను తెలంగాణ మేధావులకు అప్పగించే యోచన

రేవంత్‌ రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే కోదండరామ్‌కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఢల్లీి కార్యకలాపాల్లో సహకరించిన రాజీవ్‌ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి మాజీ సీఎం కేసీఆర్‌ రప్పించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఐఏఎస్‌గా రిటైర్‌ అయిన తర్వాత శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. ఇప్పటికీ ఆయన అదే పోస్టులో ఉన్నారు. ఆయన ఆ పోస్టు నుంచి తప్పుకుంటారని చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పుకోకపోయినా ప్రభుత్వమే పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ పోస్టులో కోదండరామ్‌ను నియమిస్తారని సమాచారం. ఆయనకు రాష్ట్ర వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో అపారమైన పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే సీఎంగా తాను సక్సెస్‌ కావడానికి దోహదపడుతుందని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

టీఎస్పీఎస్సీ ఛైర్మెన్‌ పదవి?

నిజానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులది కీలక పాత్ర. తెలంగాణలో ప్రభుత్వం మారటానికి ముఖ్య కారణం నిరుద్యోగులు. గ్రూప్‌ -1,2 నిర్వహణ విఫలం, పేపర్‌ లీకులు, ఛైర్మెన్‌ ను మర్చకపోవడం వంటి అంశాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఇక ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి రాగానే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామినిచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ ఛైర్మెన్‌ గా నిరుద్యోగుల బాధలు తెలిసిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాంకు ఇవ్వాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !