Telangana Assembly : తొలి దళిత సభాపతిగా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక !

0

తెలంగాణ అసెంబ్లీ సభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్‌ పదవికి ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో ఆ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ విషయాన్ని రేపు శాసనసభలో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పదవికి వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్‌ నామినేషన్‌పై సంతకం చేశారు. నామినేషన్‌ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. నామినేషన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.కాగా, స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత , పార్టీ శాసన సభానేత కేసీఆర్‌ను కోరడం, వారు సమ్మతించటం మరోవైపు ఎంఐఎం నేత పార్టీ సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

గడ్డం ప్రసాద్‌కుమార్‌ నేపథ్యం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడ్డం ప్రసాద్‌కుమార్‌ రెండుసార్లు వికారాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తొలిసారి ఆయన నెగ్గింది 2008 ఉప ఎన్నికల్లో. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓడారు. ఆపై కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షుడిగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచే మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. సహజంగానే అధికార పార్టీ స్పీకర్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్‌ అవుతారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ స్వస్థలం వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం బెల్కటూరు గ్రామం. తల్లిదండ్రులు ఎల్లమ్మ, ఎల్లయ్య.  తాండూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !