Guntur Kaaram Review: గుంటూరు కారం రివ్యూ !

0

మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’ ఎలా ఉంది? వెండితెరపై ఇద్దరూ మ్యాజిక్‌ చేశారా?  చాలా విరామం తర్వాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కలిసి చేసిన సినిమా ఇది. అసలు సిసలు సంక్రాంతి సందడి ఆరంభానికి సంకేతంలా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రమణగా మహేశ్‌బాబు మాస్‌ అవతార్‌ మెప్పించిందా?శ్రీలీల అందాలతో అలరించిందా? అనేది చూద్దాం.

కథేంటంటే

వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్‌ సత్యం (జయరామ్‌) కొడుకు వీర వెంకట రమణ అలియాస్‌ రమణ (మహేశ్‌బాబు). చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరిరావు) దగ్గర పెరుగుతాడు. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్‌) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి... రమణతో తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. తల్లిని ఎంతో ప్రేమించే రమణ... ఆ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడా?ఇంతకీ అందులో ఏముంది?తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టింది? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే

త్రివిక్రమ్‌ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. పాత్రలు ఇంచుమించు ఒకేలా అనిపించినా... ఆయన ఎక్కడ అవసరమో అక్కడ కథపై పూర్తి పట్టుని ప్రదర్శిస్తూ బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో మేజిక్‌ చేస్తుంటారు. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది?  దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ  సినిమా కథ.  ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్‌ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్‌లో సినిమాలను తెరకెక్కించాడు. తల్లి కొడుకుల బంధం ప్రధానంగా సాగే ఈ కథ ఆదిలోనే తేలిపోయింది. పాతికేళ్లపాటు తల్లికి దూరంగా పెరిగిన కొడుకు, సంతకం చేస్తే తెగిపోయే ఆ బంధంతో ఈ కథ ముడిపడి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ‘గుంటూరు కారం’ మెయిన్‌ కథ యద్దనపూడి సులోచనారాణి ‘కీర్తి కిరీటాలు’ ఆధారంగా తీసుకున్నదే అని అర్థం అయిపోతోంది. అయితే ఆ నవల అప్పుడెప్పుడో నాలుగైదు దశాబ్దాల కిందట వచ్చింది కాబట్టి, ఆ కథని ఇప్పుడు నవల్లో ఉన్నట్టు తీస్తే ప్రేక్షకులకి అంతగా ఎక్కదు అని త్రివిక్రమ్‌ ఆ కథని కొంచెం ఆధునికంగా తయారు చేసి ‘గుంటూరు కారం’ సినిమాగా మలిచాడు. నవలలో కూడా అమ్మ సెంటిమెంట్‌ ఉంటుంది, సినిమాలో కూడా అదే ముఖ్యమైన భాగం. ఈ సినిమాలో మహేష్‌ లో ఒక కొత్త అవతారం చూస్తారు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్‌ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడిరది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్‌ డైలాగ్స్‌, పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో బోర్‌ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. తల్లి తన కొడుకుని ఎందుకు వదిలిపెట్టిందనే విషయం, తల్లికి దూరమైన కొడుకు పడిన వేదన, ఆ నేపథ్యంలోని సంఘర్షణ ఈ సినిమాకి కీలకం. కానీ, ఇందులో ఆ సంఘర్షణపైనే దర్శకుడు పట్టు ప్రదర్శించలేకపోయాడు. గుంటూరు నుంచి హీరో హైదరాబాద్‌కి రావడం వెళ్లిపోవడమే పని అన్నట్టుగా ప్రథమార్ధం సాగుతుంది. మధ్యలో కొన్ని ఫైట్లు,  శ్రీలీల, వెన్నెల కిశోర్‌తో కలిసి హీరో చేసే హంగామా తప్ప మరేదీ ఉండదు. హీరోతో సంతకం కోసం మురళీశర్మ తన కూతురుని రంగంలోకి దించడం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు  ఏమాత్రం మెప్పించవు. అవి త్రివిక్రమ్‌ స్థాయికి తగ్గ పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం కావు. ద్వితీయార్ధంలో ప్రకాశ్‌రాజ్‌  పాత్ర చేసే రాజకీయం, ఆయన ఎత్తుగడలు ఓ పట్టాన అర్థం కావు. పైపెచ్చు  కొడుకుతో ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టించుకున్నంత మాత్రాన రాజకీయంగా కానీ, వారసత్వం విషయాల్లో కానీ ఎలాంటి సమస్యలు రావా? అసలైన ఆ విషయంలోనే సహజత్వం లోపించినట్టు అనిపిస్తుంది. మాటలతో మేజిక్‌ చేసే త్రివిక్రమ్‌ ఇందులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ‘అన్నం వద్దనుకున్నవాడు  రోజంతా పస్తులుంటాడు, అమ్మని వద్దనుకున్నవాడు జీవితాంతం ఏడుస్తాడు’. ‘అమ్మ తన బిడ్డలకి ఏం చేసిందని అడగకూడదు’, ‘తద్దినం జన్మదినం రెండూ దినాలే’ తరహా సంభాషణలు వినిపిస్తాయి. మాస్‌  పాత్రలో మహేశ్‌బాబు చేసే హంగామా, ఆయన ఎనర్జీ,  మాస్‌ పాటలు,  విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో  కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం. మహేశ్‌ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్‌ గొలుసు’ పాటకు మహేశ్‌, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి.  ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌, ఎమోషనల్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది.  హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్‌లో రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌ మెయింటైన్‌ చేస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్‌లో కథేమి ఉండడు.  ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్‌గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్‌ కథ. ఇక సెకండాఫ్‌ కాస్త హిలేరియస్‌గా సాగుతుంది. లేడిస్‌తో హీరో చేసే యాక్షన్‌ ఎపిసోడ్‌, అజయ్‌ క్యారెక్టర్‌తో పండిరచే కామెడీ బాగానే వర్కౌట్‌ అయింది. అయితే  సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు.  చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు.  తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం  ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు.  చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్‌బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.  కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్‌గానే అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 

రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్‌ బాబు.  యాక్షన్‌తో పాటు డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. డైలాగ్‌ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. సినిమా అంతా మహేష్‌ తన భుజాలమీద వేసుకున్నాడు. కామెడీ, భావోద్వేగాలు, డాన్సులు, పోరాట సన్నివేశాలు, ఒకటేంటి అన్నీ చాలా బాగా చేసి అంతా తానే అయ్యి సినిమాలో కనిపిస్తాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. అలాగే ఆమె నటన కూడా బాగుంది. ఒక తెలుగు అమ్మాయి కథానాయకురాలిగా చూడటం బాగుంది. ఎప్పటి మాదిరే డ్యాన్స్‌ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ప్రకాష్‌ రాజ్‌ కి చాలా కాలం తరువాత మళ్ళీ ఒక మంచి పాత్ర వచ్చింది, అతనికి ఇలాంటివి కొట్టిన పిండి, అందుకని చేసుకుపోయాడు. ఇక రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈశ్వరీరావు  పాత్ర, ఆమె డైలాగులు కాస్త  శ్రుతిమించినట్టు అనిపిస్తాయి.  ప్రకాశ్‌రాజ్‌, వెన్నెల కిశోర్‌  పాత్రల్లో కొత్తదనమేమీ లేదు. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేష్‌, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ఏదేమైనా  గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి.

సినిమా విశ్లేషణ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !