PM MODI : కోల్‌కతాలో నీటి అడుగున మెట్రో...ప్రారంభించిన మోదీ !

0

భారత్‌లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అట్టహాసంగా  ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఎస్‌ప్లనేడ్‌ నుంచి హావ్‌డా మైదాన్‌ స్టేషన్‌ వరకు ప్రధాని మెట్రోలో ప్రయాణం చేశారు. ప్రధాని వెంట బీజేపీ బెంగాల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ఎమ్మెల్యే సువేందు అధికారి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. నదీగర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలోని పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు.

కోల్‌కతాదే ఆ ఘనత !

దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్‌కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. ఇందులో హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కి.మీ.ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడిరది. అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతోంది. అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !