YS Sharmila : అదే జరిగితే కడపలో జగన్‌కు అంత ఈజీ కాదు !

0

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. అన్నీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక.. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ కూటమి) సరికొత్త జోష్‌ తో తాము సిద్ధమంటూ కదనరంగంలోకి అడుగేశాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన చాలాచోట్ల అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ కూడా త్వరలోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అటు వైసీపీ.. ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల సంగ్రామంలో స్పీడును పెంచాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. వైఎస్‌ షర్మిలను పార్టీ చీఫ్‌ గా ప్రకటించిన నాటి నుంచి దూకుడుగా ముందుకువెళ్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్‌ మేనిఫెస్టో మాదిరిగా.. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ పక్కా హామీలంటూ ఇటీవల విడుదల చేసింది. తాము ఎన్నికల్లో గెలిస్తే ఇవి పక్కాగా అమలు చేస్తామంటూ ఖర్గే సైతం ప్రకటించారు. అంతేకాకుండా.. ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వైఎస్‌ షర్మిల ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పిన రేవంత్‌ రెడ్డి.. తనకు అండగా ఉంటానంటూ ప్రకటించారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుందా..? అనే సందేహాల నడుమ షర్మిల కూడా తన పదునైన మాటలతో అటు అన్న వైఎస్‌ ప్రభుత్వాన్ని, ఇటు విపక్ష పార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీ మొదటి లిస్ట్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. అయితే, షర్మిల పోటీపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఇంటిపోరుతో జగన్‌ సతమతం !

మొదట వైఎస్‌ షర్మిల పోటీలో ఉండరంటూ ప్రచారం జరిగినప్పటికీ.. ఆ తరువాత పోటీలో ఉంటారంటూ క్లారిటీ వచ్చింది. ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డి కడప ఎంపీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే జగన్‌కు ఇంటిపోరు తప్పదని ప్రచారం ఊపందుకుంది. 175 సీట్లు గెలవటం అటుంచితే సొంత నియోజకవర్గంలో సొంత చెల్లి, బాబాయి కూతురు సునీత దెబ్బకు వైసీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత కుటుంబసభ్యులకే న్యాయం చేయలేదని, వైఎస్‌. వివేకానంద రెడ్డి హంతకులకు జగన్‌ కొమ్ము కాస్తున్నాడనే ప్రచారం ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది. మరో వైపు సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉండటంతో వైఎస్‌ జగన్‌కు ఇంటి నుండే తలపోటుగా తయారైనట్టు తెలుస్తోంది. మరో వైపు పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ వివేకా సతీమతి లేదా వైఎస్‌ వివేకా కుమార్తె ఎమ్మేల్యే బరిలో నిలిచే  అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది.  ప్రజాకోర్టులోనే న్యాయం కావాలని సునీత పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.  కాంగ్రెస్‌ అధిష్టానం కూడా పలు సూచనలు చేసినట్లు సమాచారం.. కడప నుంచి పోటీ చేయాలని ఢల్లీి పెద్దలు షర్మిలను కోరుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్‌ వివేకా మృతి తర్వాత జరిగిన పరిణామాలు.. సునీత.. వైఎస్‌ షర్మిలకు సపోర్ట్‌ చేసిన నేపథ్యంలో షర్మిల కడప నుంచి పోటీచేస్తే మంచి ఫలితం ఉంటుదని ఢల్లీి పెద్దలు పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే, షర్మిల అభిప్రాయాన్ని బట్టి పార్టీ అధిష్టానం డిసైడ్‌ చేయనున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 25 న కాంగ్రెస్‌ పార్టీ మొదటి లిస్ట్‌ ప్రకటించే అవకాశం ఉండటంతో షర్మిల పోటీపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ అవినాష్‌ రెడ్డి పోటీచేస్తున్నారు. ఇక్కడ నుంచి వైఎస్‌ షర్మిలా కూడా పోటీచేస్తే సొంత కుటుంబంలో హోరాహోరి పోరు తప్పదని తెలుస్తోంది. కాగా.. టీడీపీ కూడా ఇక్కడ కీలకమైన వ్యక్తికే సీటు కేటాయించాలని ప్రయత్నిస్తోంది.. దీంతో ఈసారి కడపలో త్రిముఖ పోరు ఖాయమని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !