Patanjali : ఆలస్యంగా పతంజలి లైసెన్సుల రద్దుపై...అధికారులకు సుప్రీం మందలింపు !

0


తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈసందర్భంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం తీర్పు వచ్చిన తర్వాతే పతంజలిపై చర్యలు తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు చెందిన 14 ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది. ఈవిషయాన్ని రాష్ట్ర లైసెన్సింగ్‌ అథారిటీ నేడు కోర్టుకు తెలియజేసింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఏప్రిల్‌ 10న మేము ఇచ్చిన ఆదేశాల తర్వాతే ఉత్తరాఖండ్‌ అధికారులు నిద్ర నుంచి మేలుకొన్నట్లు కన్పిస్తోంది. మీరు చేయాలనుకుంటే ఎంత వేగంగానైనా చేస్తారు. కాదనుకుంటే పక్కన పెట్టేస్తారు. తొమ్మిది నెలల నుంచి సంస్థపై మీరెందుకు చర్యలు తీసుకోలేదు? మీకు సానుభూతి కావాలంటే కోర్టుకు నిజాయతీగా ఉండండి’’ అంటూ మందలించింది. అయితే, ఈ చర్యలను చట్టప్రకారం తీసుకున్నారా? లేదా అన్నది పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

ఒరిజినల్‌ కాపీలు సమర్పించండి !

ఇక, నేటి విచారణకు కూడా పతంజలి వ్యవస్థాపకుడు రామ్‌దేవ్‌బాబా, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో తాము పత్రికల్లో ఇచ్చిన బహిరంగ క్షమాపణల డిజిటల్‌ కాపీలను న్యాయస్థానానికి అందజేశారు. దీనిపై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒరిజినల్‌ రికార్డులను సమర్పించమంటే ఈ-కాపీలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ‘చివరి అవకాశం’ కల్పిస్తున్నామని, ప్రతీ పత్రికలో ఇచ్చిన క్షమాపణల ఒరిజినల్‌ పేజీలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !