Kalki 2898 AD Review : అబ్బురపరిచే కల్కి కథా ప్రపంచం !

0

బాహుబలి చిత్రాల తర్వాత  ప్రభాస్‌ పూర్తిగా పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. అందుకు తగినట్లే ఆయన ఎంచుకునే కథలు ఉంటున్నాయి. ఇక ‘మహానటి’ తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ్‌ అశ్విన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే ఓ పాన్‌ వరల్డ్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకుని పురాణాలను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్‌, నాలుగేళ్ల నిర్మాణం, అమితాబ్‌, కమల్‌ వంటి అగ్ర తారాగణం నటించడంతో యావత్‌ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో హిట్‌ పడిరదా ? వెండితెరపై నాగ్‌ అశ్విన్‌చేసిన మేజిక్‌ ఏంటి ?

కథేంటంటే 

కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ, అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను లాక్కొని స్వర్గంలాంటి కాంప్లెక్స్‌ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్‌ (కమల్‌హాసన్‌). మరో పక్క దేవుడు ఎప్పటికైనా పుడతాడు, ప్రపంచాన్ని కాపాడతాడు అని నమ్ముతూనే కాంప్లెక్స్‌ మనుషులని అంతం చేయాలని కొంతమంది ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా శంబాలా నగరంలో మరియమ్మ(శోభన) ఆధ్వర్యంలో బతుకుతుంటారు. కాశీలో బౌంటీ ఫైటర్‌ అయిన భైరవ (ప్రభాస్‌) యూనిట్స్‌ని సంపాదించి కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్‌ తలపెట్టిన ప్రాజెక్ట్‌ కె కోసం, కాంప్లెక్స్‌ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌-కె కోసం గర్భవతుల్ని చేసి, వారి నుంచి సీరమ్‌ సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా సుమతి (దీపికా పదుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. అక్కడి నుంచి సుమతి (దీపికా పదుకోన్‌) అనుకోని పరిస్థితుల్లో తప్పించుకుంటుంది. దీంతో ఆమెని పట్టుకుంటే మిలియన్‌ యూనిట్స్‌ ఇస్తామని చెప్పడంతో ఆమెని అందరూ వెంటాడుతారు. దీంతో చిరంజీవిగా ద్వాపరయుగం నుంచి బతుకుతున్న అశ్వత్థామ(అమితాబ్‌ బచ్చన్‌) ఆమెని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. భైరవ కూడా ఆమెని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. అశ్వత్థామ, సమ్‌ 80తో కలిసి ఎక్కడికి వెళ్లారు? అశ్వత్థామకు ఉన్న శాపం ఏంటి? ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు? భైరవ %-% అశ్వత్థామ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? శంబాలాలో ఏం జరుగుతుంది? కాంప్లెక్స్‌ మనుషులు శంబాలాని ఎందుకు నాశనం చేయాలనుకుంటారు? భైరవ ఎవరు? అతను సమ్‌ 80ని పట్టుకున్నాడా? ఇంతకీ కల్కి సమ్‌ 80 (దీపికా)కు పుడుతున్నాడని ఎలా తెలుస్తుంది? కలియుగాంతానికి మహాభారతానికి సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. 


ఎలా ఉందంటే

హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ, వాటికి మన పురాణాల్ని మేళవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బుర పరుస్తుంది. మహాభారతంలోని పాత్రలు తీసుకొని.. మన పురాణాలకు లింక్‌ పెడుతూ.. రెండు సరికొత్త ప్రపంచాలను సృష్టించాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అది సక్సెస్‌ అయ్యిందా లేదంటే సాగదీసాడా ఇవన్నీ పక్కన పెడితే.. ముందు ఆ ఆలోచనకు హాట్సాఫ్‌ చెప్పాలి. కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళుతుంది సినిమా. ప్రభాస్‌ కూడా ఆలస్యంగానే తెరపైకొస్తాడు. నీటి జాడ లేని భవిష్యత్తు కాశీ నగరం, ఆక్సిజన్‌ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్‌ దురాగతాలు కథలో లీనం చేస్తాయి. పాన్‌ ఇండియా ట్రెండ్‌ మొదలయ్యాక అడుగడుగునా హీరోల ఎలివేషన్‌ సన్నివేశాల్ని చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు.  కానీ, నాగ్‌ అశ్విన్‌ ఇందులో హీరోయిజం కంటే కూడా, కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సన్నివేశాల్ని మలచడం విశేషం. కథలోని మూడు ప్రపంచాలు వేటికదే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టి పడేస్తుంది. ప్రథమార్ధంలో అక్కడక్కడా సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించినా ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్‌ పాత్ర కామిక్‌ టచ్‌తో సాగుతుంది. ప్రభాస్‌ చేసే తొలి ఫైట్‌, కాంప్లెక్స్‌లో దిశా పటానీతో కలిసి చేసే సందడి, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రథమార్ధానికి హైలైట్‌. ద్వితీయార్ధంలోనూ అమితాబ్‌, ప్రభాస్‌ మధ్య సన్నివేశాలు, సుమతి పాత్రతో ముడిపడిన కథ కీలకం.  పతాక సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. భారతీయ పురాణాల్లోని సూపర్‌హీరోలు ఎలా ఉంటారో  మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు. రెండో భాగం సినిమా కథ భైరవ వర్సెస్‌ యాస్కిన్‌తో ఉంటుందనే సంకేతాలతో తొలి భాగం కథ ముగుస్తుంది. ప్రభాస్‌ పాత్రకు సంబంధించి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ అభిమానులతో విజిల్స్‌ వేయించడం ఖాయం. భవిష్యత్తు కాశీకీ, కాంప్లెక్స్‌కీ మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా ఉన్నా, వెండితెరపై ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకనిర్మాతలు, సాంకేతిక బృందం విజయవంతమైంది. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది. ఇక బుజ్జి వెహికల్‌ అయితే ఓ రేంజ్‌ లో తయారుచేసారు. సెకండ్‌ హాఫ్‌ లో వెహికల్‌ తో అద్భుతాలు, అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌ చేసారు. మహాభారతం విజువల్స్‌ అయితే సినిమా మొత్తం మీద ఒక్క 5 నిముషాలు అక్కడక్కడా ఎలివేషన్‌ షాట్స్‌ లా చూపిస్తారు. కానీ బెస్ట్‌ విజువల్స్‌ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మహాభారతాన్ని ఇంత బాగా ఎవరు చూపించలేదని మాత్రం చెప్పొచ్చు. టెక్నికల్‌ గా ఎంత బాగా చూపించినా ఎమోషన్‌ ని ఎక్కడా మిస్‌ అవ్వలేదు. సెకండ్‌ హాఫ్‌లో ఆ ఎమోషన్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇక క్లైమాక్స్‌ అయితే వేరే లెవల్‌ ఉంటుంది. ఎవరూ ఊహించని ట్విస్ట్‌ తో పాటు కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌ అనౌన్స్‌ చేసి ఈ సినిమాకు ఇంకో రెండు, మూడు పార్టులు ఉంటాయని హింట్‌ ఇచ్చారు. సినిమాలో అంతర్లీనంగా ఓ చక్కని మెసేజ్‌ కూడా ఇచ్చారు. మనుషులు భూమిలోని వనరులు అన్ని లాగేసుకొని ప్రకృతిని నాశనం చేసేస్తున్నారని చక్కని మాటలతో చెప్పారు.

ఎవరెలా చేశారంటే

పభాస్‌ మరోసారి అదరగొట్టాడు.. కామెడీ పోర్షన్‌ కూడా తనే తీసుకున్నాడు. సినిమా అంతా ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో కనిపించే ప్రభాస్‌ మరో ఎత్తు.  కొన్నిసార్లు కథంతా అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె చుట్టూనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. అమితాబ్‌ బచ్చన్‌ ఇమేజ్‌, ఆయన నటన ఈ సినిమాకి బాగా ఉపయోగపడిరది. ఈ వయసులోనూ ఆయన పోరాట ఘట్టాలు చేసిన తీరు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. బాహుబలి ప్రభాస్‌ కటౌట్‌కి దీటుగా కనిపించే పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా అమితాబ్‌ బచ్చన్‌ నటించారు. డీ గ్లామరస్‌గానే అయినా దీపికా పదుకొణ బలమైన పాత్రలో కనిపిస్తుంది. దిశా పటానీ పాత్ర అలా మెరిసి, ఇలా మాయమైపోతుంది. శోభన, అన్నాబెన్‌, పశుపతి, మానస్‌ పాత్రలో స్వాస్థ్‌ ఛటర్జీ తదితరులు పోషించిన పాత్రల పరిధి తక్కువే అయినా ప్రభావం చూపించారు. బ్రహ్మానందం, ప్రభాస్‌తో కలిసి కొన్ని నవ్వులు పంచారు. సుప్రీమ్‌  యాస్కిన్‌గా విలన్‌ పాత్రలో కమల్‌హాసన్‌ కనిపిస్తారు. ఆయన గెటప్‌ భయపెట్టేలా ఉంటుంది. ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువే అయినా, పరిచయం చేసిన తీరు, మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని  మాటలు ఆలోచింపజేస్తాయి. రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలిచ్చారు. మరోవైపు మూడు గంటలు నిడివి ఉన్నా సినిమా అలా సాగిపోతూ ఉండటానికి కారణం అతిథి పాత్రలు. అవి కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ఓ జోష్‌ వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన పేర్లు రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళి, విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్‌నారాయణ్‌ నేపథ్య సంగీతం, జోర్డే కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం. ప్రొడక్షన్‌ డిజైన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. ‘నిజానికి నమ్మకంతో పనిలేదు సమయం వచ్చినప్పుడు కళ్ల ముందే కనిపిస్తుంది’ వంటి సంభాషణలు బాగున్నాయి. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజువలైజేషన్‌, ఆయన చెప్పిన కథ మనసుల్ని హత్తుకుంటుంది. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మాణం స్ఫూర్తి దాయకం. ఆ సంస్థ యాభయ్యేళ్ల ప్రయాణానికి దీటైన సినిమా ఇది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !