Lokshabha : చరిత్రలో ఇదే ప్రథమం ...లోక్‌సభ స్పీకర్‌ పదవికి పోటీ !

0

18వ లోక్‌సభ స్పీకర్‌ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీపడుతోంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది.  డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షానికి అప్పగించాలన్న సంప్రదాయాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్‌ ఆరోపిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవిని విపక్షాలకు ఇస్తే స్పీకర్‌కి మద్దతు తెలుపుతామని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. అందుకు ఎన్డీయే సమ్మతించకపోవటంతో పోటీ అనివార్యం అయ్యింది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్‌ వేయగా.. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ బరిలో నిలిచారు.

సంప్రదాయానికి విరుద్ధంగా...

వాస్తవానికి లోక్‌సభలో స్పీకర్‌ పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా.. గత హయాంలో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి. స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే.. ఉప సభాపతి స్థానాన్ని  తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే స్పీకర్‌ పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. ఈ ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్‌ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ.. డిప్యూటీ స్పీకర్‌ పదవి కావాలన్న డిమాండ్‌ మళ్లీ ముందుంచాయి. కానీ, దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్‌ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్‌ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం (జూన్‌ 26) ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.

1946 తర్వాత మళ్లీ ఇప్పుడే..

స్వాతంత్య్రానికి పూర్వం.. 1925 ఆగస్టు 24న అప్పటి ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి.రంగాచారియార్‌పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్‌ జె.పటేల్‌ స్పీకర్‌గా నెగ్గారు. కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు స్పీకర్‌ పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్‌ నేత జి.వి.మౌలాంకర్‌.. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్‌గా కొన్నాళ్లు కొనసాగారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలంకర్‌ మరణంతో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్‌.. స్పీకర్‌ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా నియమితులయ్యారు. అలా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్‌, జి.ఎస్‌.ధిల్లాన్‌, బలరాం జాఖడ్‌, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !