తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల 6న కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసుల్లో గుర్తు చేసింది. ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్గా మాట్లాడడం, అలాగే పలు వర్గాలపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ తప్పుగా ప్రస్తావించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణా కమిటి కోరింది. అయితే పార్టీ షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్న ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ గీత దాటితే...వేటే !
ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ లైన్ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కుల గణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం’ అని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని.. రాహుల్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అయ్యారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇదో హెచ్చరిక అని, భవిష్యత్లో ఎవరైనా పార్టీలైన్ దాటితే చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్.. ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.
మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు !
అయితే సొంత పార్టీ విషయంలో నవీన్ వైఖరి మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను ఆయన దగ్ధం చేశారు. అలాగే.. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపు కూడా ఇచ్చారు.మరోవైపు.. వరంగల్లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే జానారెడ్డి కళ్లలో ఆనందం కోసమే తనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారంటూ కరీంనగర్లో నవీన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు.