దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయిన రన్యారావు (Ranya Rao) కు బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆమెను విచారిస్తే బంగారం అక్రమ రవాణా రాకెట్ బయటపడొచ్చని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు కస్టడీ కోరుతూ న్యాయస్థానానికి అర్జీ పెట్టుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావుకు స్టెప్ డాటర్ అయిన రన్యా రావు అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేష్. సినీ రంగంలో రాణించవచ్చన్న నమ్మకంతో రన్యా రావుగా పేరు మార్చుకుంది. తరచూ దుబాయ్కు వెళ్లి వస్తుండటంతో డీఆర్ఐ అధికారులు ఆమెపై దృష్టిసారించారు. గత 15 రోజుల్లో 4సార్లు వెళ్లి వచ్చిందని రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి ఆమె దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకొంది. రామచంద్రరావు హోదా అడ్డుపెట్టుకొని ఓ కానిస్టేబుల్ సాయంతో రెండు, మూడు తనిఖీ కేంద్రాల నుంచి సులువుగానే బయటకొచ్చారు. చివరి ద్వారం వద్ద మాత్రం డీఆర్ఐ అధికారులు నిలువరించి, సోదాలు చేశారు. దీంతో బంగారం అక్రమ రవాణా వెలుగుచూసింది. తొడలకు జిగురు రాసుకొని 14 బంగారు బిస్కెట్లను అంటించుకొని, దానిపై టేపు, మరో వరస క్రేప్ బ్యాండేజ్ వేసుకోవడాన్ని అధికారులు గుర్తించి, అరెస్టు చేశారు. కొందరు రాజకీయ నాయకులు, అధికారులు, నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్కి తరలిస్తే.. దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఐపీఎస్ అయిన బంధువు హోదా ఉపయోగించుకొనే విమానాశ్రయం నుంచి బయటకొచ్చాక పోలీసు ఎస్కార్ట్తోనే ఇంటికి వెళ్లేదని తెలిసింది.
రన్యారావు ఇంట్లో సోదాలు..
రన్యా రావు విమానాశ్రయంలో అరెస్టయ్యాక ల్యావెల్లీ రోడ్డులోని ఆమె ప్లాట్లో పోలీసులు సోదాలు చేశారు. రూ.2.67 కోట్ల నగదు, 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, మరో 600 గ్రాముల ఆభరణాలు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ రూ.17.29 కోట్ల ఉంటుందని తెలిసింది. బంగారం స్మగ్లింగ్ చేస్తే ఏకంగా 12 లక్షల వరకు మిగులుతాయని తెలుస్తోంది.
రన్యారావును విచారిస్తున్న అధికారులు..
ఎయిర్ పోర్ట్ లో రన్యారావును అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు ఆమెను విచారించడం ప్రారంభ్షింరు. ఇందులో ఆమె కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్ మెయిల్ చేసినట్టుగా రన్యారావు చెప్పిందని సమాచారం. ఎయిర్ పోర్ట్ లో కూడా ఓ కానిస్టేబుల్ సహాయం చేసేశారు. అధికారులు అతని స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. త్వరలోనే రన్యారావు భర్తను కూడా అధికారులు విచారించనున్నారు.
రన్యారావు తండ్రీ ఐపీఎస్ అధికారి...
రన్య తండ్రి కే రామచంద్రారావు కర్ణాటక డీజీపీ. అయితే ఆమెకు ఈయన సవతి తండ్రి. వారిద్దరి మధ్యా చాలా రోజులుగా సంబంధాలు లేవని తెలుస్తోంది. రన్యా పట్టుబడ్డాక ఆయన రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. నాలుగు నెలల క్రితం ఆమెకు పెళ్ళయిందని..అప్పటి నుంచి ఆమెతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు. భర్తతో పాటు ఆమె ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు. రన్యా తన భర్తతో పాటూ ఎటువంటి వ్యాపారాలు చేస్తోందన్నది తనకు తెలియదని అన్నారు. ఆమె పట్టుబడిన విషయం విన్నాక తాను షాక్ కు గురయ్యాని డీజీపీ చెప్పారు.